Thursday, February 26, 2015

నిత్య జీవనం - సత్య జీవనం

సర్వశక్తి గల పరమాత్మ యొక్క ఉనికి రెండు అంశములలొ శాశ్వతముగా కలదు. మనము ఏదైతే బాహ్య ప్రపంచమున చూచి అనుభవించుచున్నామో అది ఆయన వెలుపలి అంశ. ఈ ప్రపంచము యొక్క కారణ ప్రభావములే ఆ పరమాత్ముని అంతర్గత అంశ. ఈ రెండు అంశలూ శాశ్వతమైనప్పటికీ, వేలుపలిది ఎప్పుడూ కనిపించునదిగానూ మార్పు చెందునదిగానూ, అంతర్గతమైనది కళ్ళకు కనిపించని మార్పులేనటువంటిదిగానూ ఉన్నది. ఆ పరమాత్ముని శక్తి అంతరాంతరమునుండి నిత్యం అన్నింటినీ వ్యక్త పరచి, లయపరచి తిరిగి సృష్టించుచూ ఉన్నది. మానవుడు తన ఇంద్రియ, తర్క, భౌతిక, యాంత్రిక జ్ఞానములతో తన బాహ్యాంతరంగములలో ఏది నిజమో తెలుసుకొనలేక సతమతమౌతున్నాడు. విజ్ఞానము మరియు అన్ని తత్త్వశాస్త్రములు ఈ రెండింటిలోనూ తమ ప్రయత్నములను చేయుచూ సత్యమును గ్రహించుటకు ప్రయత్నించుచున్నది. విజ్ఞాన శాస్త్రజ్ఞులు తమ ప్రయత్నముతో చంద్రుడు మరియు ఇతర గ్రహాల వరకు వారి పరిశోధనను కొనసాగించుచూ నక్షత్ర మండలమునకు చేరుకోనుచున్నారు. ఆధ్యాత్మికవేత్తలు, తత్వవేత్తలు మరియు యోగులు అంతర్ముఖులై ఆ పరమాత్ముని దివ్య శక్తిని అనుభవించుచున్నారు.

శాశ్వతమైన ఆత్మ యొక్క ఈ అంతర్ముఖ అనుభవముతో ఆ పరమాత్ముని రెండు అంశముల గురించిన జ్ఞానము వెలుగులోనికి వచ్చినది.

అణు శాస్త్రము విద్యుదయస్కాంత శక్తి ద్వారా కొంత అణు శక్తిని కనుగొనగలిగినది. కానీ ఇది సంపూర్ణమైన దైవ శక్తి కాదు. భౌతిక అణువు యొక్క కేంద్రము నుండి ప్రాణశక్తి వెలువడినప్పుడు, ఆ అణువు చుట్టూ భౌతిక శరీరము ఏర్పడును. ఆ ప్రాణశక్తితో పాటూ, ఇంద్రియ జ్ఞానములూ అభివృద్ది చెంది మనసు, బుద్ధి సృష్టించబడును. ఈ బుద్ధికి తత్త్వ జ్ఞానము అనుగ్రహించబడి మానవుడు తన బాహ్యము మరియు అంతరంగములలోని సత్యమును అన్వేషించుచున్నాడు. ఇక్కడ గ్రహించవలసినది పైన చెప్పబడిన అన్ని జ్ఞానములు, శక్తులు ఒక అణువు యొక్క కేంద్రము నుండి వెలువడినదే.



ప్రాణశక్తిని వెలువరించే ఆ అణువు మానవ దేహములో శిరస్సు మధ్యన ఆ మానవుని జీవిత కాలము అంతయూ ప్రకాశించుచూ ఉండును. ఆ అణువు యొక్క ప్రకాశము మరియు ప్రాణశక్తిని ఒక దివ్య శక్తి నియంత్రించుచున్నది. యోగులు, ఋషులు తమ తపో ఫలములతో దానిని తెలుసుకొని, అదియే ఆత్మ అణువు, ఆత్మ అని భాహిర్గతపరిచారు. ఈ ఆత్మ అణువే పరమాత్మ యొక్క శాశ్వత నివాసము. ఈ ఆత్మ అణువే జీవాత్మగానూ  పరమాత్మగానూ ఉన్నది. అనునిత్యమూ సర్వాంతర్యామిగా పరమాత్మ ఈ అణువునుండి ప్రపంచమునంతయూ పరిపాలించుచున్నాడు.

పైవిషయమునుండి ఈ ఆత్మాణువే పరమాత్ముని శాశ్వత నివాసము అని గ్రహించుచున్నాము. సర్వాంతర్యామి అగు ఆ పరమాత్మ అన్నింట తన ఉనికిని ప్రదర్శించుచున్నాడు. మానవుడు  అంతర్ముఖుడై పయనించినపుడే దీనిని గ్రహించగలడు.

పరమాత్మ తప్ప ఇక ఏదీ లేదు. నిత్యమూ అంతరంగమున మార్పు చెందక మరియూ బాహ్యమున మార్పు చెందుచూ ఉన్నది ఆ పరమాత్మయే. అందువలనే, మానవుని లోని ఆత్మ మరియు శరీరము ఆ పరమాత్ముడు తనను తాను వ్యక్త పరచుకొనిన విషయములే. ఇప్పటివరకూ మానవుడు తన జీవితము అనిత్యమైనదిగా ఊహించుకుంటున్నాడు. ఒక యోగ తర్కవాది కూడా తనకున్న ఆత్మ జ్ఞానముతో తాను ఒక ఆత్మనని, ఆత్మ జ్ఞానము పొంది ముక్తి చెందుట కొరకే ఈ భౌతిక దేహం తనకు ఇవ్వబదినదని అది అశాస్వతమని అనుకొనుచున్నాడు.

ఈ ఆత్మాణువు, జీవాత్మ మరియు పరమాత్మకు ఒక్కటే. ఉన్నతమైన దివ్య ఆత్మ అనుభవములలో, జీవాత్మ, పరమాత్మ, అనగా దైవం, మానవుడు ఒక్కటే. కానీ జీవునిలోని ఆత్మ అహంకారం, కర్మం, మాయ అను త్రిదోషములతో కప్పబడిఉన్నది. దీనిని జయించి ఆత్మసాక్షాత్కారం ఆపై పరమాత్మ సాక్షాత్కారం పొందవలెను.  ఇంద్రియ జ్ఞానము గల జీవితమును పరిశుధమైన దైవ జీవనముగా మార్చుకొని, స్వచ్చమైన ప్రేమ కలిగి జీవించవలెను. ఆ సర్వశక్తి గల పరమాత్ముని కృపతో ఈ దైవ మానవుడు నిత్య జీవితమును పొంది జీవించును.

పరమాత్ముని నిత్య జీవితం మానవునికి గల దివ్య హక్కు. ఈ దివ్య హక్కును గురించి ఎరుగక, దానిని విస్మరించడం దైవ సంకల్పం కాదు.

మరణము మానవుని అంతము కాదు. మరణములో భౌతిక శరీరము మాత్రమే నశించును. భౌతిక మరణానంతరం ఆత్మ వేరొక శరీరమును ఎంచుకొని మళ్ళీ పుట్టును. ఆత్మ తన భౌతిక కాయమును వదిలి వేరొక శరీరములో మళ్ళీ పుట్టుటకు కొంత కాలముఆలస్యమగును. ఆ కాలము మన కర్మానుసారం నిర్ణయింపబడును. ఆ మధ్య కాలమున ఆత్మ, పుణ్యాత్మ అయినచో వారి శిష్యులు, అనుచరులు, భక్తులను దీర్ఘకాలము వరకు రక్షించుచూ, మార్గనిర్దేశం చేయుచూ  ఉండును. కానీ, ఈ విధముగా ఒకరు ఉన్నతమైన నిత్య జీవనము పొందలేరు. దేహమును వదిలినచో మళ్ళీ జననము తప్పదు. ఇదే పునరపి జననం పునరపి మరణము.

పరమాత్మను దర్శించి పరమానందముతో మరణము లేని నిత్య జీవితం పొందగలడు. చిరంజీవి అయి జీవించగలడు. మరణ రహిత మరియు ఆనంద జీవనం మానవుని లక్ష్యము. ఈ జీవితం మానవుని ఆత్మ/అంతర్గతమునుండి తన ప్రయాణమును మొదలుపెట్టును. ప్రపంచములోని అన్ని మార్గములు బోధించు ఆత్మజ్ఞానమును పొంది ఆపై మరణమును జయించి భౌతిక నిత్య దేహమును పొంది చిరంజీవులుగా జీవించుటయే పరమాత్మ సంకల్పము.

" వేదములలో మరణమును జయించి నిత్య జీవనం పొందుటను గురించి చెప్పబడి ఉన్నది. "
- శ్రీ జ్యోతి రామలింగ స్వామి

మరణమును జయించి నిత్య జీవనం పొందుట గురించి శ్రీ రామలింగ స్వామి వారి గ్రంధములు మనకు బోధించుచున్నవి. 

No comments:

Post a Comment