Sunday, February 8, 2015

దేవాలయములు మనకు ఏమి సూచిస్తూ ఉన్నది?

ఆత్మ సాధన లో మనము ముందు తెలుసుకోవలసినది "నేను ఎవరిని?" అని. నేను ఎవరు అని తెలుసుకొనునదే జ్ఞానం. జీవాత్మయగు తనను తెలుసుకొనిన వాడే, ఆ పరమాత్మను తెలుసుకొనగలడు.

ప్రతి అణువులోనూ ఉన్న ఆ పరమాత్మ మన దేహమంతయూ వ్యాప్తి చెంది ఉన్నాడు. మన శరీరములోని ఒక్కో అంగములోనూ ఒక్కో శక్తీ రూపములో వ్యాప్తి చెంది ఉన్నాడు. దీనినే మన పూర్వీకులు బాహ్య ప్రపంచములో వివరింపదలచారు. 

మనలోని ఆ పరమాత్మను బాహ్యములో  భావన చేసి, ప్రార్థించుటకు, ఒక్కో తత్వానికి, శక్తికి, ఒక్కో రూపమును ఇచ్చి ఆ రూపములను దేవతలుగా సృష్టించిరి. ఆ దేవతల కొరకు అనేక దేవాలయములను, ఇతిహాస పురాణములను ఏర్పరచిరి.  ఇందు మూలముగా నిజమును గ్రహించి, జ్ఞానమును పొందుటకు మార్గమును చూపించిరి. 

దేహమే ఆలయము:

మనలోని పరమాత్మను తెలుసుకొని, ఆ పరమాత్మను పొందదలచి, మన శరీరమునే ప్రతిరూపముగా ఉంచి, దేవాలయములను నిర్మించిరి. 


అనగా, పై చిత్రములో చూపించబడినట్టుగా, మన పాదములనే ప్రవేశ గోపురముగా, పది వ్రేళ్ళు ఆ గోపురము పై ఉన్న  కలసములుగా, పురుష అంగం, మూలాధార చక్ర స్థలం ధ్వజస్థంబముగా చెప్పబడినది. నాభి బలి పీటము, పై కడుపు నంది. నంది అనగా మన ఆహారమును జీర్ణము చేయి శక్తి. మన ముఖములోని నోరు, గర్భగుడి లోనికి ప్రవేశ ద్వారము. 

" మన శరీరమంతటికీ శిరస్సే ప్రథానం. " - జ్ఞానుల వాక్కు 

ఆ శిరస్సు మధ్యలో, ప్రకాశవంతముగా, జ్యోతి స్వరూపుడై ఆ పరమాత్మ కొలువున్నాడు. ఇదే మూల స్థానమని పిలువబదుచున్నది. ఈ కారణము వల్లనే శిరస్సు ప్రథానమని ఉపదేసించిరి. శిరస్సు మధ్య కొలువై ఉన్న ఆ పరమాత్మ, మన దేహమంతయూ వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆ పరమాత్మ కొలువై ఉన్న ప్రదేశమునే మూలస్థానము, గర్భ గుడి అని చెప్పబడినది. 

ఏ శివాలయములోనైననూ, కుడి ప్రక్కన విఘ్నేస్వర సన్నిధి, ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్య (ఆరు ముఖ) సన్నిధి, ఇంకనూ ముందు భాగమున, ఎడమ వైపున శక్తి (అమ్మవారి) సన్నిధి ఉండును. 

మన దేహములో ఛాతియందు, కుడి వైపున ఐదు తలలతో కూడిన నాడి ఒకటి  కలదు. ఇదే పంచముఖ విఘ్నేశ్వరుడు, ఎడమ వైపున ఆరు తలలతో ఉన్న నాడి కలదు. ఇది మన శరీరములో ఉన్న 72,000 నరములకూ ప్రధానమైనది. ఇదే ఆరు ముఖం (సుబ్రహ్మణ్యం) అని చెప్పబడినది. 

మన ఛాతి యందు ముందు భాగమున, ఎడమ వైపున ఉన్నది హ్రుదయము. ఇది మన శరీరములోని చెడు రక్తమును శుధ్ధి చేసి అన్ని అవయవములకూ రక్తమును ప్రవహింపచేసి అన్ని అవయవములూ సక్రమముగా పని చేయుటకు శక్తిని ఇచ్చును. అందువలనే అమ్మవారిని శక్తి రూపముగా మనము ఆరాధించుచున్నాము. రక్తపు రంగు ఎరుపు కనుక ఆ శక్తిని ఎరుపు రంగులో  సూచిస్తున్నాము. ఆ కారణము చేతనే, అమ్మవారికి కట్టు చీర సైతం ఎరుపు రంగు, అక్కడ ప్రసాదముగా ఇవ్వబడుచున్న కుంకుమ ఎరుపు రంగుతో ఉన్నవి. మన శరీరములో ప్రవహించు రక్తము శక్తి స్వరూపం. శక్తి లేనిదే మనము లేము. ఇందు కారణము చేతనే అనేక మంది శక్తిని ఉపాసించుచున్నారు. 

మహా విష్ణువు హృదయ స్థానములో మహా లక్ష్మి కొలువై ఉన్నది అని చెప్పుట కూడా ఈ కారణము చేతనే !!

No comments:

Post a Comment